తాటిపూడి రిజర్వాయర్ లో రెండో దశ బోట్ షికార్ ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్
Minister Kondapalli Srinivas started the boat ride
విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ గంట్యాడ మండలంలోని తాటిపూడి రిజర్వాయర్ లో వాటర్ స్పోర్ట్స్ సింపుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోటు షికారు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పది బోట్లను, రెండు టూరిజం స్థాళ్ళను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. గత కొంతకాలంగా తాటిపూడి రిజర్వాయర్ లో వాటర్ స్పోర్ట్స్ సింపుల్ ఇండియా ఆధ్వర్యంలో బోట్ షికారు కార్యక్రమాలు జరుగుతున్న విషయం వితమే. జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రెండవ దశ బోటు షికారు పనులకు ఆ సంస్థ చేపట్టింది. ఇందులో భాగంగా 19 సీట్లతో కూడిన వాటర్ ట్యాక్సీ, ఆరు సీట్లతో కూడిన స్పీడ్ బోట్, 12 సీట్లతో కూడిన గల్ఫ్ బ్రిడ్జ్ బోట్, 6 సీట్లతో కూడిన వర్లాండో బోట్, రెండు సీట్లతో కూడిన ఓషన్ కయాక్ బోట్లు నాలుగు, రెండు సీట్లతో కూడిన వాటర్ రిక్షాలను రెండింటి ద్వారా బోటు శిఖారు కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి.

మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, అతి తక్కువ ఖర్చుతో అధిక ఆదాయాన్ని ఇచ్చి, ఉపాధి అవకాశాలను పెంచే రంగాలలో పర్యాటక రంగం మొదటిదని, ఆ రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా తాటిపూడి రిజర్వాయర్ లో బోట్ షికార్ కార్యక్రమాలకు తమ ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు. ఈ రిజర్వాయర్ లో బోట్ షికారు కార్యక్రమాలు ప్రారంభించడం ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు ఆహ్లాదాన్ని, వినోదాన్ని పంచడమే కాకుండా, ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టామని ఆయన తెలియజేశారు. జిల్లాలో పర్యాటకులను ఆకర్షించేందుకు ఉన్న అవకాశాలలో తాటిపూడి రిజర్వాయర్ బోట్ షికారు కార్యక్రమాలు ప్రధమమైనవని, వీటిని జిల్లాలోని పర్యాటకులు వినియోగించుకుని తమ కుటుంబాలతో సహా ఆహ్లాదమైన వాతావరణంలో వినోదాన్ని ఆస్వాదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తాటిపూడి రిజర్వాయర్ సాగునీటి సంఘం అధ్యక్షుడు, పలువురు పర్యట శాఖ అధికారులు, వాటర్ స్పోర్ట్స్ సింపుల్ ఇండియా ప్రతినిధులు,స్థానిక నాయకులు పాల్గొన్నారు.
