భోగి మంటల్లో మెడికల్ కాలేజీల పీపీపీ జీవో ప్రతులు..
YCP DIST PRISIDENT M.SRINIVASA RAO
కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై పీపీపీ విధాన జీవో ప్రతులను జెడ్పీ ఛైర్పర్సన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ మజ్జి శ్రీనివాస్ రావు మంటల్లో వేసి తగులబెట్టారు. సంక్రాంతి పండగతో మొదలవుతున్న ఈ సుఖ సంతోషాలు ఈ కొత్త ఏడాదిలో కొనసాగాలంటే, కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు భోగి మంటల్లో కాలిపోవాలని ఆయన నినదించారు. గురువారం విజయనగరంలోని తమనివాసంలో ప్రజల మధ్యన కుటుంబ సమేతంగా భోగి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చిన పీపీపీ విధానాన్ని ఆయన మరోసారి ఖండించారు. ఈ కొత్త ఏడాదిలో ఎటువంటి ప్రకృతి వైఫరిత్యాలు ఏవీ జరగకుండా ఉండేందుకు ఈ సంక్రాంతి పండగను ప్రజలంతా జరుపుకుంటారని అన్నారు. ఐతే ఈ కూటమి ప్రభుత్వంలోని ప్రధాన భాగస్వామ్య తెలుగుదేశం పార్టీ గడచిన ఏడాది అంతా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేసిందని ఆయన దుయ్యబట్టారు. పేద ప్రజలకి ఉచిత వైద్య విద్యను, వైద్యాన్ని అందించాలన్న గొప్ప సంకల్పంతో తమ వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకు వచ్చారని గుర్తు చేశారు. ఐతే ఈ కూటమి ప్రభుత్వం పీపీపీ విధానాన్ని తీసుకు వచ్చి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని ఈ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకించారని అన్నారు.ఈ ప్రజా వ్యతిరేక విధానంపై ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ఉద్యమం ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లిందన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకి ఉచిత వైద్యాన్ని, వైద్య విద్యను దూరం చేయకూడదన్న నినాదంతో ఈ రాష్ట్రంలోని మేధావులు, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు, అనేక వర్గాలు వారు ముక్త కంఠంతో ఖండించారని అన్నారు.

దేశంలో ఎక్కడాలేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలంతా తప్పుబడుతున్నా, ఈ కూటమి ప్రభుత్వం తమకి అధికారం ఉందన్న బలంతో గుడ్డిగా ముందుకు వెళ్తోందని ద్వజమెత్తారు. ఏడాది మొత్తంగా ప్రజలు తాము పడ్డ కష్టాలు, బాధలను ఈ భోగి మంటల్లో కాలిపోవాలని ఎలాగైతే కోరుకుంటారో, ఈ భోగి మంటల్లోనే మెడికల్ కాలేజీల పీపీపీ విధానం కాలిపోవాలని, ప్రజలకి మేలు జరగాలని ఈ జీవో ప్రతులను మంటల్లో వేయడం జరిగిందన్నారు. ఈ పీపీపీ విధానం వద్దని న్యాయస్థానాలు సైతం చెబుతున్నా ఈ కూటమి ప్రభుత్వం పెడచెవిన పెడుతోందన్నారు. మెడికల్ కాలేజీలపై పీపీపీ విధానం రద్దు కావాలి, ప్రజలకి మేలు జరగాలన్న ఉద్దేశ్యంతోనే ఈ జీవో ప్రతులను భోగి మంటల్లో వేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ సూర్యనారాయణ రాజు, నెల్లిమర్ల నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు బడ్డుకొండ ప్రదీప్ నాయుడు, వైసీపీ నాయకురాలు మజ్జి సిరి సహస్ర, జిల్లా పార్టీ కార్యదర్శులు వర్రి నరసింహ మూర్తి, ఇప్పిలి అనంతం, గొర్లె రవికుమార్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు మహంతి జనార్ధన్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు జైహింద్ కుమార్, ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాస్ నాయుడు, యువజన విభాగం అధ్యక్షుడు అల్లు అవినాష్, అధికార ప్రతినిధి కనకల రఘురామ్, పూసపాటి రేగ, చీపురుపల్లి మండల పార్టీ అధ్యక్షులు పతివాడ అప్పల నాయుడు, వరహాల నాయుడు, తెర్లాం వైఎస్ ఎంపీపీ సత్యనారాయణ, రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి రేగాన శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.
