మోంథా తుఫాన్ ఎఫెక్ట్ తో దెబ్బతిన్నమొక్కజొన్న
mantha cyclone effect
Montha Cyclone on Vizianagaram: రాష్ట్ర రైతాంగాన్ని కుదిపేసిన నిన్నటి మోంథా తుఫాన్ ఎఫెక్ట్ విజయనగరం (Vizianagaram) జిల్లాలోని గజపతినగరం మండలం గడసాం మొక్క జొన్న రైతులను గగ్గోలు పెట్టేలా చేసింది. అమ్మకానికి సిద్ధం చేసిన మొక్క జొన్న దిగుబడిని తుఫాన్ కారణంగా రైతులు ఇళ్లల్లో భద్రం చేశారు. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో మొక్క జొన్న కంకులను ఆరుబయట ఎండబెట్టుకునే అవకాశం లేక రైతులు తమ కొట్టాల్లో దాచుకోవలసి వచ్చింది. దీంతో జొన్నలకి తేమ పట్టి, బ్లాక్ ఫంగస్ పేరుకుపోయి కంకులన్నీ పడిపోయాయి. చాలావరకు పంటకు వేళ్లు కూడా వేసేసాయి.
Montha Cyclone on Vizianagaram: దీంతో గడసాంలోని దాదాపు ఏడు వందల మంది రైతులకు చెందిన 350 ఎకరాల్లోని రెండు వందల టన్నులకు పైగా మొక్క జొన్న దిగుబడి దెబ్బతిన్నది. తుఫాన్ అనంతరం రైతులు మొక్కజొన్నలను ఆరుబయట ఎండ బెట్టి కొంతలో కొంతైనా వ్యాపారులు కొనుక్కుని వెళ్తారన్న ఆశతో ఎదురు చూశారు. కానీ వ్యాపారులు కూడా నాణ్యత కోల్పోయిందన్న నెపంతో మొక్క జొన్న కొనేందుకు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట నష్టాలను అంచనా వేస్తామన్న యంత్రాంగం కూడా తమను పట్టించుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో గడసాం రైతులంతా తమను ప్రభుత్వం ఆదుకోవాలని గగ్గోలు పెడుతున్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి సత్వరమే తమకు న్యాయం చేయాలని లేదంటే తామంతా తీవ్ర నష్టానికి గురవుతామని ప్రభుత్వాన్ని అర్థిస్తున్నారు. గడసాం రైతుల ఆవేదనను అర్ధం చేసుకుని ప్రభుత్వానికి ప్రతిపాదించాలని తమ ప్రాంత ప్రజా ప్రతినిధులను వారు వేడుకుంటున్నారు.
Also Read: స్లాటర్ హౌస్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు- ఎస్పీ ఎ.ఆర్. దామోదర్
