భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు: ఎస్పీ
SP Damodar inspects security arrangements
శివరాత్రి పర్వదినాన రామతీర్ధంకు సుమారు లక్షమంది భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున, సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. విజయనగరం నుండి రామతీర్ధంకు వచ్చే ప్రత్యేక ఆర్టీసి బస్సులను, రణస్థలం నుండి రామతీర్ధంకు వచ్చే ప్రత్యేక ఆర్టీసి బస్సులను వేరే స్ధలంలో పార్కింగు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. సీతారామస్వామి ఆలయం, కోనేరు-బాత్ ఘాట్స్, కేశ ఖండనశాల, నీలాద్రి కొండపైన, ట్రాఫిక్ రెగ్యులేషను, వాహనాల పార్కింగు, మూవింగు పార్టీలుగా బందోబస్తును విభజించామన్నారు. రామతీర్ధం నీలాద్రి కొండపైన ఎటువంటి ప్రమాదాలు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని, భక్తులకు క్యూ లైన్లను ఏర్పాటు చేసి, లైటింగ్ ఏర్పాటు చేసి, పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్ ద్వారా త్వరితగతిన దర్శనాలు అయ్యే విధంగా చూడాలన్నారు. ట్రాఫిక్ రెగ్యులేషను, గొలుసు, జేబు దొంగతనాలు, ఈవ్ టీజింగు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. అదే విధంగా మఫ్టీలో పోలీసులను నియమించి, పేకాటలు, డొక్కాటలు, ఇతర అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడాలన్నారు. తాత్కాలిక కంట్రోల్ రూంలను నుండి నిరంతరం భద్రత ఏర్పాట్లును పర్యవేక్షించాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు.

