తప్పుల్లేని పాసుపుస్తకాలనే పంపిణీ చేయాలి- జెసి సేధు మాధవన్
JC Sethu Madhavan
తప్పులు లేని పాసుపుస్తకాలనే పంపిణీ చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు. ఆయన గురువారం బొండపల్లి, డెంకాడ మండలాల్లో పర్యటించారు. తాహసీల్దార్ కార్యాలయాల్లో జరుగుతున్న పట్టాదారు పాసుపుస్తకాల పరిశీలనా ప్రక్రియను తనిఖీ చేశారు. బొండపల్లి, డెంకాడ తాహసీల్దార్లు డి.రాజేశ్వర్రావు, ఎన్.రాజారావును అడిగి వివరాలు తెలుసుకున్నారు. రైతుల ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించి, రైతుల వద్దనుంచి సరైన వివరాలను సేకరించి, ఎటువంటి తప్పులు లేని పాసుపుస్తకాలను ముద్రించాలని ఆదేశించారు. వాటిని మార్చి 2వ తేదీ నుంచి 9వ తేదీలోగా పంపిణీ చేయాలని సూచించారు. డెంకాడ మండలం సింగవరం, బొండపల్లి మండలం కొండకిండాం సచివాలయాలను తనిఖీ చేశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, అన్ని వివరాలు సరిపోయిన తరువాత ఈకెవైసి అనంతరం పట్టాదారు పాసుపుస్తకాలను ముద్రించాలని చెప్పారు. జాయింట్ ఎల్పిఎంలను విడదీయాలని, తద్వారా కొత్తగా రూపొందిన ఖాతాలను సైతం తనిఖీ చేసి, వాటికి కూడా పాసుపుస్తకాలను తయారు చేయాలని ఆదేశించారు. మ్యుటేషన్లను 15 రోజుల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుందని జెసి స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం మార్చినెలలో చేయాల్సిన పాసుపుస్తకాల పంపిణీని పూర్తి చేయాలని ఆదేశించారు.
