భక్తులకు అసౌకర్యం కలగకూడదు-కలెక్టర్
Devotees should not be inconvenienced - Collector
జిల్లాలో అత్యంత ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం, ఎస్.కోట మండలం పుణ్యగిరి (శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం) లో మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి గురువారం పరిశీలించారు. ఫిబ్రవరి 15న జరగనున్న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, ఆయన అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు.భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన క్యూలైన్లు ఏర్పాటు చేయాలని, తొక్కిసలాట జరగకుండా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.కొండపైకి వచ్చే భక్తుల కోసం మంచినీరు, నీడ (చలువ పందిళ్లు), పారిశుధ్య ఏర్పాట్లలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలను కేటాయించాలని చెప్పారు.సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ దర్శనాలు సాఫీగా జరిగేలా చూడాలని, దేవదాయ శాఖ అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, శివరాత్రి సందర్భంగా జిల్లాలోని రామతీర్థం, పుణ్యగిరి వంటి ప్రధాన క్షేత్రాలకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ పర్యటనలో ఆర్డీవో డి. కీర్తి, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శిరీష, స్థానిక తహశీల్దార్ శ్రీనివాసరావు, ఆలయ ఈవో నాగేంద్ర, ఉత్సవ ప్రత్యేక అధికారి రమణి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.
