ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య సేవలు సక్రమంగా అందించాలి – కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
Medical services should be provided properly in primary health centers - Collector S. Ramsunder Reddy
పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు సక్రమంగా అందించాలని, అవుట్ పేషెంట్ల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ ద్వారా అందిస్తున్న సేవలపై సమీక్ష నిర్వహిస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను విస్తృతం చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. డాక్టర్లు ఎల్లవేళలా అందుబాటులో ఉండి, ప్రజలకు నమ్మకం కలిగేలా పనిచేయాలని సూచించారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో నెలకు కనీసం పదిహేను వందలు మందికి సేవలు అందించాల్సి ఉండగా, చాలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 50 శాతo మందికి కూడా సేవలు అందజేయకపోవటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్. సి. డి. స్క్రీనింగ్ శత శాతం పూర్తి చేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో గర్భిణీలకు డెలివరీలు తప్పనిసరిగా చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో డెలివరీ చేయించుకున్న వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలను గూర్చి ప్రచారం చేయాలని తెలిపారు. మాతృత్వ, శిశు మరణాలు సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, హై రిస్కు గల కేసులను నిరంతరం పర్యవేక్షణ చేయాలని, డెలివరీ తేదీకి ముందుగానే ఆసుపత్రిలో చేర్పించాలని ఆదేశించారు. డయేరియా కేసులు వస్తే సంబంధిత ఎంపీడీవోకు వెంటనే సమాచారం అందజేసి అప్రమత్తం చేయాలని, ఆ గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని, డయేరియా రావడానికి గల కారణాలను తెలుసుకొని అధికారులు సమన్వయంతో పనిచేసి వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు.
