కన్నుల పండుగగా వందేమాతరం శతగళార్చన -పరిమళించిన దేశభక్తి
Vande Mataram Shatagala Archana
వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో సంస్కార భారతి విజయనగరం జిల్లా శాఖఅధ్యక్షురాలు చివుకుల శ్రీలక్ష్మీ ఆధ్వర్యంలో జరిగిన వందేమాతరం శతగళార్చనతో దేశభక్తి పరిమళించింది.విజ్ఞాన భారతి పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగు భాషా పరిరక్షణసమితి అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ మాట్లాడుతూ స్వరాజ్య ఉద్యమ నేపథ్యంలో పెల్లుబికిన వందేమాతరం భారత జాతి చైతన్యాన్ని పట్టి ఊపిందని, వందేమాతరం భగవద్గీత అంత పవిత్రమైనదని వందేమాతరం మన రక్తంలోనే ఉందని అన్నారు. కార్యక్రమాన్ని ఆర్ ఎస్ ఎస్ సంఘ్ పరివార్ సంయోజకులు చెరుకూరి శ్రీధర్, విజ్ఞాన భారతి ప్రధానోపాధ్యాయురాలు విమల జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలలో పలు పాఠశాలలు, కళాశాలలకు చెందిన 200 మంది విద్యార్థులు పాల్గొనగా విజేతలుగా నిలిచిన వారికి ముఖ్య అతిథి సముద్రాల గురుప్రసాద్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు, బహుమతులు, జ్ఞాపికలు అందచేసారు. పోటీలకు న్యాయనిర్ణేతలుగా మహారాజాప్రభుత్వ సంగీత నృత్యకళాశాల అధ్యాపకురాలు మహాలక్ష్మీ, ప్రముఖ రచయిత్రి కొంకేపూడి అనూరాధ వ్యవహరించారు. ఈ సమావేశంలో సంస్కార భారతి ప్రధాన కార్యదర్శి కుప్పా సావిత్రి, ఉపాధ్యక్షులు డి.రవికుమార్, కోశాధికారి సాలూరు సంతోషి తదితరులు పాల్గొన్నారు.
