ఏటా లక్ష మంది ‘అగ్నివీర్’ల భర్తీ ?
Agnipath Scheme
Agnipath Scheme in Army: త్రివిధ దళాల్లో బలగాల కొరతను భర్తీ చేసేందుకు రానున్న రోజుల్లో నియామకాలను పెంచే యోచనలో భారత సైన్యం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రతి ఏడాది 45 వేల నుంచి 50 వేల మందిని నియమించుకుంటుండగా.. ఈ సంఖ్యను లక్షకు పెంచే ఆలోచనలో ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. కరోనా మహమ్మారి సమయంలో రెండేళ్ల పాటు నియామకాలు నిలిపివేయడమే ఈ కొరతకు కారణంగా తెలుస్తోంది.
కరోనా సమయంలో 2020, 2021లో రెండేళ్లపాటు సైన్యంలో నియామకాలు నిలిచిపోయాయి. అదే సమయంలో ఏడాదికి 60వేల నుంచి 65 వేల మంది సైనికులు పదవీవిరమణ చేశారు. ఆ తర్వాత (నాలుగేళ్ల సమయానికి) 2022లో అగ్నిపథ్ పథకం ప్రారంభమైంది. భారీ స్థాయిలో నియామకాలు చేపట్టేందుకు చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. ఆ ఏడాది త్రివిధ దళాల్లో దాదాపు 46వేల ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రయత్నాలు చేసింది.
Agnipath Scheme in Army: కేంద్ర ప్రభుత్వం గతంలో వెల్లడించిన వివరాలను పరిశీలిస్తే 2023లోనే త్రివిద దళాల్లో 1.55లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సైన్యంలో ఏటా పదవీ విరమణలకు, నియామకాలకు మధ్య వ్యత్యాసం ఉండటంతో భారీ స్థాయిలో ఖాళీలు ఏర్పడుతున్నట్లు సమాచారం. ఇటీవల ఏడాదికి దాదాపు 20 నుంచి 25 వేల ఖాళీలు ఉంటుండడంతో ప్రస్తుతానికి 1.8లక్ష ఖాళీలు ఏర్పడినట్లు అంచనా.
ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం అగ్నిపథ్ పథకం (Agnipath Scheme) ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 1.75లక్షల మంది అగ్నివీరులను నియమించుకున్నట్లు తెలిసింది. అయితే, అగ్నివీరుల నాలుగేళ్ల వ్యవధి వచ్చే ఏడాదితో పూర్తి కానుంది. వీరిలో అనేక మందితోపాటు రెగ్యులర్ సైనికులు కూడా పదవీవిరమణ చేయాల్సి రానుండడంతో రానున్న రోజుల్లో ఖాళీలు భారీగా పెరుగుతాయి.
Also Read: బెంగాల్ను టచ్ చేస్తే దేశాన్ని కుదిపేస్తాం – మమతా బెనర్జీ
