ఏపీలో మరో బస్సు ప్రమాదం ! మన్యం జిల్లాలో ఆర్టీసీ బస్సు దగ్ధం !

RTC BUS Catches Fire

RTC BUS Catches Fire

RTC BUS Catches Fire: తెలుగు రాష్ట్రాలను వరుస బస్సు ప్రమాదాలు వణికిస్తున్నాయి. ఏపీలో కర్నూలు, తెలంగాణాలో చేవెళ్ళ సమీపంలో ఘోర బస్సు ప్రమాదాల నుండి తేరుకునే లోపే ఏపీ లోని పార్వతీపురం-మన్యం జిల్లాలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ నుండి ఒడిశాలోని జైపూర్ వెళ్తున్న ఒడిశాకు చెందిన ఆర్టీసీ (OSRTC) బస్సులో… పార్వతీపురం-మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలోని మంటలు చెలరేగాయి. అయితే బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న ప్రయాణీకులను అందరికీ అప్రమత్తం చేసి… క్రిందకు దించేయడంతో అందరూ సురక్షితంగా బయపడ్డారు. అయితే ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమయింది. బస్సు అగ్నికి ఆహుతవుతున్న దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

RTC BUS Catches Fire: పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలోని ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ఘాట్ రోడ్డులో బస్సులో మంటలు చెలరేగాయి. OD 10S 6754 బస్సులో మంటలు రావడాన్ని గుర్తించిన డ్రైవర్‌ వెంటనే అప్రమత్తమయ్యారు. చెక్‌పోస్టు వద్ద బస్సును నిలిపివేసి ప్రయాణీకులను అ‍ప్రమత్తం చేశారు. దీనితో ప్రయాణీకులంతా ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న సాలూరు ఫైర్ స్టేషన్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో చర్యలు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడడంతో ఆర్టీసీ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

ఘటనా స్థలాన్ని పరిశీంచి, ప్రమాద కారణాలపై ఆరా తీసిన ఎస్పీ

RTC BUS Catches Fire: స్థానిక పోలీసుల సమాచారంతో పార్వతీపురం-మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి… ఒడిశా ఆర్టీసీ బస్సు దగ్ధమైన ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటనకు గల కారణాలును బస్సు సిబ్బంది, ప్రయాణీకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ… ఉదయం 7 – 7.20 మద్యంలో అగ్నిప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డు ఎక్కుతుండగా బస్సు ఇంజిన్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి ఉంటాయని అనుకుంటున్నాం. ఘటన జరిగేటప్పుడు బస్సులో పది మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తత కావడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. వెంటనే పాచిపెంట పోలీసులు, సాలూరు అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. ఫైర్ , ఆర్.టి.ఓ సిబ్బంది తో విచారణ చేయించి మంటలకు కారణాలను వెలికితీస్తాం. బస్సు ఒడిశా రాష్ట్రానికి చెందింది. లేటెస్ట్ బస్సే అయినా ఘాట్ రోడ్డు కావడంతో ఇంజిన్ లో మంటలు వచి ఉండొచ్చు అని అన్నారు.

బస్సు ప్రమాద ఘటనపై ఆరా తీసిన జిల్లా ఇన్ చార్జి మంత్రి అచ్చెన్నాయుడు

పార్వతీపురం మన్యం జిల్లా‌ పాచిపెంట సమీపంలో ఒడిశాకు చెందిన ఆర్టీసీ బస్సు దగ్ధం ఘటనపై జిల్లా ఇన్చార్జి మంత్రి కింజరాపుఅచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) ఆరా తీసారు. ఈ ఘటనపై ఎస్పీ మాధవరెడ్డితో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బస్సు దగ్ధం ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని ఎస్పీ మంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇటువంటి ఘటనపునరావృతం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. రవాణా శాఖ, ఆర్టీసీ,సంయుక్తంగా డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి సూచించారు.

ఇదిలా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణీకులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది.. చేవెళ్ల దగ్గర మరో ప్రమాదంలో 19 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనల కారణంగా మృతుల కుటుంబాలు ఇంకా శోకసంద్రంలోనే ఉన్నాయి.

Also Read: కాశీబుగ్గ తొక్కిసలాట క్షతగాత్రులను పరామర్శించిన జెడ్పీ చైర్మెన్ చిన్న శ్రీను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *