రామతీర్థంలో శివరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్
District Collector inspects Shivaratri arrangements at Ramatheertham
విజయనగరం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నెల్లిమర్ల మండలం రామతీర్థం శ్రీ సీతారామ స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని, భక్తుల క్యూ లైన్లను పర్యవేక్షించిన ఆయన, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. శివరాత్రి నాడు ఆలయానికి పోటెత్తే సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. తాగునీరు, నీడ, పారిశుధ్యం, పార్కింగ్ మరియు భద్రతా పరమైన అంశాల్లో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. శివాలయాన్ని కూడా సందర్శించి క్యూలైన్లను పరిశీలించారు. వేడుకలు ప్రశాంతంగా జరిగేలా అన్ని విభాగాల సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. సందర్భంగా శ్రీ సీతారామస్వామి వారిని దర్శించుకొని పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఆర్డీవో డి. కీర్తి, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శిరీష, ఆలయ ఈవో శ్రీనివాసరావు, తహశీల్దార్ శ్రీకాంత్, స్థానిక ఎంపీడీఓ కె.రామకృష్ణరాజు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
