గాయపడిన పోలీస్ కానిస్టేబుల్ ఆరోగ్యంపై హోం మంత్రి అనిత ఆరా
HOME MINISTER ANITHA
విజయనగరం జిల్లా గజపతినగరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ తిరుపతిరావు విధి నిర్వహణ సమయంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన తిరుపతిరావు ప్రస్తుతం జిల్లా సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర హోం మంత్రి అనిత, కానిస్టేబుల్ తిరుపతిరావు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులతో ఫోన్లో మాట్లాడిన మంత్రి, ప్రస్తుతం అందిస్తున్న వైద్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. కానిస్టేబుల్ తిరుపతిరావుకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను మంత్రి అనిత ఆదేశించారు. అవసరమైతే అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు.తిరుపతిరావు భార్యతో ఫోన్లో మాట్లాడిన హోం మంత్రి, ఆమెకు ధైర్యం చెప్పారు. తిరుపతిరావు కుటుంబానికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని మంత్రి అనిత భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్తో కూడా మాట్లాడిన హోం మంత్రి, చికిత్స విషయంలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని స్పష్టం చేశారు.
