కోస్తా జిల్లాలపై మొంథా తుపాను ఎఫెక్ట్‌ – హోం మంత్రి అనిత

Weather-2

మొంథా తుపాను 28న అర్ధరాత్రి కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పినట్లు ఏపీ హోం మంత్రి అనిత తెలిపారు. దీనిపై గత నాలుగు రోజులుగా సీఎం చంద్రబాబు అప్రమత్తం చేస్తున్నారన్నారు. తుపాను నేపథ్యంలో అప్రమత్తతపై విపత్తుల నిర్వహణ శాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. 100కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్న తరుణంలో అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.

భారీ హోర్డింగ్‌లను ముందుగానే తొలగిస్తున్నట్లు చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నామన్నారు. సాధ్యమైనంత వరకు ఆస్తినష్టం తగ్గించే విధంగా చూస్తున్నామన్నారు. సాంకేతికతను వినియోగించుకుంటూ తుపాను సహాయక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. 6 ఎన్డీఆర్‌ఎఫ్‌, 13 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. కోస్తా జిల్లాలన్నింటిపైనా తుపాను ప్రభావం చూపే అవకాశం ఉందని, కాకినాడ పరిధిలోని 6 మండలాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని చెప్పారు. అవసరమైతే ప్రజలను తరలించేందుకు హెలికాప్టర్లను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

అధికారులంతా అందుబాటులో ఉండాలి – అనగాని

మొంథా తుపాను దృష్ట్యా రెవెన్యూ అధికారులను మంత్రి అనగాని సత్యప్రసాద్ అప్రమత్తం చేశారు. నాలుగు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులంతా క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. తుపాను నేపథ్యంలో అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ముందస్తు రక్షణ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్‌ ఆర్‌ మహేశ్‌కుమార్‌ వెల్లడించారు. జిల్లాలో 90 కి.మీ పరిధిలో సముద్రతీర ప్రాంతం ఉందని ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక వాచ్‌పాయింట్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించుతున్నామన్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 28, 29 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించినట్లు చెప్పారు.

అప్రమత్తమైన కాకినాడ యంత్రాంగం

మరోవైపు దూసుకొస్తున్న మొంథా తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కాకినాడ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఉప్పాడ కొత్తపల్లి మండలంలో తీర ప్రాంత గ్రామాలపై తుపాను తీవ్ర ప్రభావం చూపనున్న నేపథ్యంలో స్థానికులతో అధికారులు సమావేశం నిర్వహించారు. కాకినాడ ఆర్టీవో మధుబాబు, పిఠాపురం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పీడీ చైత్ర వర్షిణి ఆధ్వర్యంలో స్థానిక మత్స్యకారులతో సమావేశం నిర్వహించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని, బోట్లను సురక్షితంగా ఒడ్డుకు చేర్చాలని కోరారు. మండలంలో 27 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తీర ప్రాంత వాసులను ఆయా పునరావాస కేంద్రాలకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం క్షేత్రస్థాయిలో తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆర్డీవో మల్లిబాబు అధికారులతో చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *