ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు
Elaborate arrangements made for the Chief Minister's visit
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి జిల్లా పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ఈ నెల 28 న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కోసం సీఎం జిల్లాకు రానున్న నేపధ్యంలో, చీపురుపల్లి మండలం రావివలస సమీపంలోని పైలపేట వద్ద ఏర్పాటు చేయనున్న సభా ప్రాంతాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ సందర్శించారు. అందుకు అధికారులు సిద్ధం చేసిన మ్యాపులను, ఆ ప్రాంతాన్ని, హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ ఎస్ సేధు మాధవన్,. ఏఎస్పీ సౌమ్యలత, ఇతర అధికారులతో చర్చించి, గ్రామ సమీపంలోని లేఅవుట్ లో హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని, అక్కడికి దగ్గరలోని ఖాళీ స్థలంలో బహిరంగ సభను నిర్వహించాలని సూచించారు. అలాగే ఈ ప్రాంతాన్ని కలుపుతూ ప్రతిపాదించిన, నిర్మాణంలో ఉన్న రహదారులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

పర్యటనలో ఇంచార్జి ఆర్డీవో ప్రమీల గాంధీ, పీఆర్, ఆర్ అండ్ బి ఎస్ఈలు శ్రీనివాసరావు, కాంతిమతి, రెవెన్యూ, పోలీసు, సర్వే శాఖ అధికారులు, మండల అధికారులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.
