కేదార్నాథ్, యమునోత్రి ఆలయాల మూసివేత
శీతాకాలం రావడంతో హిమాలయాల్లోని పవిత్ర పుణ్యక్షేత్రాలైన కేదార్నాథ్, యమునోత్రి ఆలయాలను ఉత్తరాఖండ్ అధికారులు మూసివేశారు. ఈ సందర్భంగా గురువారం ముగింపు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రుద్రప్రయాగ్ నుంచి కేదార్నాథుడి పల్లకి ఊరేగింపు ఆర్మీ మేళతాళాలు, సుమారు పది వేల మంది భక్తుల నినాదాల మధ్య ఘనంగా ప్రారంభమయింది. ఈ ఊరేగింపు శనివారం నాటికి ఉఖిమఠ్లోని ఓంకారేశ్వర ఆలయానికి చేరుకోనుంది. మిగిలిన ఆరునెలల పాటు ఆ ఆలయంలో కేదార్నాథుడు పూజలందుకుంటాడు. ఈ ఉత్సవాల్లో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్సింగ్ ధామీతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది చార్ధామ్ యాత్ర చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ ఆలయాలను అధికారులు మూసివేయగా, బద్రీనాథ్ ఆలయాన్ని నవంబరు 25న మూసివేయనున్నారు. మంచు, తీవ్రమైన చలి కారణంగా ప్రతి సంవత్సరం అక్టోబరు- నవంబరు నెలల్లో ఈ ఆలయాలను మూసివేసి ఏప్రిల్- మే నెలల్లో తిరిగి తెరుస్తారు.
