బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయి – హరీష్ రావు
బీసీ రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్, బీజేపీ పార్టీలు డ్రామాలు చేస్తున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. శనివారం ట్విటర్ వేదికగా రెండు పార్టీలపై విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఈ రెండు పార్టీలు మద్దతు ఇచ్చాక, బీసీ రిజర్వేషన్ల పెంపు ఆపే వారు ఎవరు?. పార్లమెంట్లో బీజేపీకి 240 మంది ఎంపీలు, కాంగ్రెస్కు 99 ఎంపీల బలం ఉంది.
రిజర్వేషన్ల బిల్లు అడ్డుకునేది ఎవరు? రిజర్వేషన్ల పెంపుపై ఢిల్లీలో కొట్లాడాల్సిన రెండు జాతీయ పార్టీలు బీసీలను మభ్యపెడుతూ గల్లీలో డ్రామాలు చేస్తున్నాయి. బీసీలను అవమానిస్తున్నాయి. ఆరుసార్లు జనాభా లెక్కింపు చేసిన కాంగ్రెస్ పార్టీ ఏనాడూ బీసీ గణన చేయలేదు. బీజేపీ అయితే ఏకంగా జన గణనను నాలుగేళ్లుగా వాయిదా వేస్తూ వస్తున్నది. గడిచిన 35 ఏళ్లల్లో ఈ దేశాన్ని కాంగ్రెస్ 15 ఏళ్లు, బీజేపీ 17 ఏళ్లు పాలిస్తే ఏనాడు ఈ రెండు పార్టీలకు బీసీలు గుర్తుకు రాలేదు.
కానీ ఇప్పుడు రెండు జాతీయ పార్టీలు బీసీలపై కపట ప్రేమ నటిస్తున్నాయి. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఉండాలని 2005లోనే కోరిన ఏకైక నేత కేసీఆర్. రిజర్వేషన్లు పెంచాలని రెండుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారు. స్వయంగా ప్రధానిని కలిసి విజ్ఞప్తిచేశారు. అయినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చలనం రాలేదు. ఇప్పటికీ రిజర్వేషన్లు పెంచలేదు. బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదు.
“Jitani Abadi Utna haq” అని నినదించే రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ఎందుకు పెట్టడం లేదు?. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గానీ, బండి సంజయ్ గానీ, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గానీ ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదు?. రాజకీయ లబ్ధి పొందేందుకు ఇప్పుడు ఒకరిని మించి ఇంకొకరు నటిస్తున్నారు. పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ ద్వారా బీసీ రిజర్వేషన్ల పెంపు సాధించాల్సింది పోయి కాలయాపన చేస్తున్నాయి. ఏ పార్టీ బిల్లు పెట్టినా దానికి బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఉంటుంది. ఎలాంటి పోరాటానికైనా బీఆర్ఎస్ కలిసి వస్తుంది. ఇప్పటికైనా గల్లీలో డ్రామాలు కట్టిపెట్టి.. ఢిల్లీ వేదికగా బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పోరాటం మొదలు పెట్టాలని కాంగ్రెస్, బీజేపీలను డిమాండ్ చేస్తున్నాం’ అని రాసుకొచ్చారు.
