పదిలో శతశాతం ఫలితాలను సాధించాలి-కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
Collector S.Ramsundar reddy
పదోతరగతిలో శతశాతం ఫలితాలను సాధించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు. స్థానిక విటి అగ్రహారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్ధులతో మాట్లాడి బోధన గురించి తెలుసుకున్నారు. విద్యార్ధుల హాజరు, పదోతరగతి విద్యార్దులకు నిర్వహిస్తున్న ప్రత్యేక వంద రోజుల శిక్షణా కార్యక్రమం, మధ్యాహ్న భోజన పథక నిర్వహణ, పాఠశాలలోని ఇతర సమస్యలను తెలుసుకున్నారు. సుమారు 106 మంది పదోతరగతి విద్యార్ధులకు వంద రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నామని, కిచెన్ షెడ్ శిధిలావస్థకు చేరుకుందని, మరుగుదొడ్లు, ఆర్ఓ ప్లాంట్ మరమ్మతులు చేయాల్సి ఉందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.మార్టిన్ లూథర్ కలెక్టర్కు వివరించారు. పదోతరగతిలో అందరూ ఉత్తీర్ణత సాధించేవిధంగా కృషి చేయాలని ఆదేశించారు. ఇతర సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
కొండకరకాం ఎంఎస్ఎంఈ పార్కు స్థలం పరిశీలించిన కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి

విజయనగరం జిల్లాలో భారీ ఎత్తున పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మండలంలోని కొండకరకాం గ్రామ పరిధిలోని ప్రతిపాదిత ఎంఎస్ఎంఈ పార్కు స్థలాన్ని గురువారం జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సందర్శించారు. సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఈ పార్కులో రోడ్లు, కాలువలు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలపై సంబంధిత అధికారులతో చర్చించారు. స్థలాన్ని చదునుచేసి, వీలైనంత వేగంగా వాటిని కల్పించాలని ఆదేశించారు.ఈ పర్యటనలో ఆర్డిఓ డి.కీర్తి, పరిశ్రమలశాఖ జిఎం కరుణాకర్, ఎపిఐఐసి జోనల్ మేనేజర్ ఎం.మురళీమోహనరావు, తాహసీల్దార్ కూర్మనాధ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
