అటవీ విస్తీర్ణంలో భారత్‌కు తొమ్మిదో స్థానం

Government_unlocks_funds_to_increase_forest_cover_in_India

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అటవీ విస్తీర్ణంలో భారత్‌ తొమ్మిదో స్థానానికి చేరుకుంది. వార్షిక అటవీ విస్తీర్ణ వృద్ధిలో మూడో స్థానాన్ని నిలుపుకొందని బుధవారం విడుదలైన గ్లోబల్‌ ఫారెస్ట్‌ రిసోర్స్‌ అసెస్‌మెంట్‌-2025 నివేదికలో వెల్లడైంది. గతేడాది పదో స్థానంలో ఉన్న భారత్‌ ఈసారి ఒక మెట్టు పైకెక్కింది. వార్షిక వృద్ధిలో చైనా, రష్యాల తర్వాతి స్థానాన్ని భారత్‌ ఆక్రమించింది. దేశంలో ఈ ఏడాది అటవీ విస్తీర్ణం 1,91,000హెక్టార్లు(0.27%) పెరిగింది. చైనాలో 0.77%, రష్యాలో 0.11% వృద్ధి నమోదైంది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్‌ పెద్దఎత్తున అడవుల పెంపకం, అటవీ సంరక్షణ ప్రయత్నాలను ఇది ప్రతిబింబిస్తుందని కేంద్ర పర్యావరణ శాఖ తెలిపింది. ‘‘అటవీ నిర్వహణ, పర్యావరణ పరిరక్షణలో భారత్‌ పదో స్థానం నుంచి తొమ్మిదో స్థానానికి రావడం ఓ పెద్ద విజయం. సుస్థిర అటవీ నిర్వహణ, పర్యావరణ సమతౌల్యానికి భారత్‌ కట్టుబడి ఉందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం’’ అని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌చేశారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 4.14 బిలియన్‌ హెక్టార్ల(32 శాతం) అటవీ ప్రాంతముందని నివేదికలో పేర్కొంది. దీనిలో సగానికి(54 శాతం) పైగా రష్యా, బ్రెజిల్, కెనడా, అమెరికా, చైనాల్లో కేంద్రీకృతమైంది. ఆస్ట్రేలియా, కాంగో, ఇండోనేసియాలను అనుసరిస్తూ మొదటి 10 అటవీ సంపన్న దేశాల్లో భారత్‌ కూడా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *