న్యూసౌత్ వేల్స్ పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెట్టాలి – నారా లోకేశ్
ఏపీలో అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టార్టప్లు, గ్రీన్ టెక్నాలజీలో సహకారాన్ని ప్రోత్సహించేందుకు ఏపీ-న్యూసౌత్ వేల్స్ ఇన్నోవేషన్, ఇండస్ట్రీ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేశ్ కోరారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా న్యూసౌత్ వేల్స్ ప్రీమియర్ క్రిస్ మిన్స్తో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇన్నోవేషన్, వాణిజ్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ఏపీ, న్యూసౌత్ వేల్స్ ప్రభుత్వాల మధ్య ఒప్పందాన్ని సులభతరం చేయాలని కోరారు. న్యూసౌత్ వేల్స్ ఇన్నోవేషన్ క్లస్టర్లను ఏపీలో రాబోయే ఇన్నోవేషన్, స్టార్టప్ హబ్లతో (విశాఖపట్నం, అమరావతి, అనంతపురం) అనుసంధానించే కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
రెన్యూవబుల్ ఎనర్జీ, మెడిటెక్, అగ్రిటెక్, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో పనిచేస్తున్న న్యూసౌత్ వేల్స్ కంపెనీలు ఏపీ పరిశ్రమ కారిడార్లలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని మంత్రి కోరారు. క్లీన్ టెక్, కృత్రిమ మేధస్సు (AI), సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో పరిశోధన, అభివృద్ధి కోసం న్యూసౌత్ వేల్స్ విశ్వవిద్యాలయాలు, ఆంధ్రప్రదేశ్ విద్యాసంస్థల మధ్య సహకారానికి ప్రోత్సాహం అందించాలని కోరారు. విశాఖపట్నంలో జరగనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ -2025కి న్యూసౌత్ వేల్స్ మంత్రి నేతృత్వంలో ప్రతినిధి బృందాన్ని తమ రాష్ట్రానికి పంపించాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు.
