చెరుకు క్రషింగ్ పురోగతిపై జెసి సమీక్ష
జిల్లాలో చెరుకు క్రషింగ్ కార్యకలాపాల పురోగతిని జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ సోమవారం సమీక్షించారు. చెరుకు రవాణా, క్రషింగ్, రైతులకు చెల్లింపులు, మిల్లుల పనితీరుపై అధికారులు వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. త్వరలోనే క్షేత్రస్థాయిలో సమావేశం నిర్వహించి రైతుల సమస్యలు, షుగర్ ఫ్యాక్టరీల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటామని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన చెరకు ధరను ప్రజాప్రతినిధుల సమక్షంలో అధికారికంగా ప్రకటించనున్నట్లు చెప్పారు.ప్రస్తుతం జిల్లాలో చెరుకు విస్తీర్ణం రెండున్నర లక్షల టన్నులుగా ఉండగా, అది నాలుగు లక్షల ఎకరాలకు విస్తరించాల్సిన అవసరం ఉందని జెసి పేర్కొన్నారు. చెరకు సాగు విస్తరణకు వ్యవసాయ శాఖ అధికారులు, తాసిల్దార్లు కృషి చేయాలని ఆదేశించారు.
చెరకు సాగు పెంపుతో షుగర్ ఫ్యాక్టరీల మిల్లింగ్ సామర్థ్యం సక్రమంగా వినియోగించుకునే అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు.సమావేశంలో కేన్ కమిషనర్ & డిప్యూటీ కమిషనర్ (షుగర్ ఫ్యాక్టరీ) ఎం. సత్యనారాయణ, సంకిలి షుగర్ ఫ్యాక్టరీ యూనిట్ హెడ్ వెంకట సూర్య, కేన్ హెడ్ కమల్ పట్నాయక్, చీపురుపల్లి ఆర్డీవో సత్యవేణి, జిల్లా వ్యవసాయ అధికారి వి టి రామారావు, తాసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
