ఐదేళ్లూ సిద్ధరామయ్యే సీఎం – యతీంద్ర
Yathindra Siddaramaiah: కర్ణాటకలో సీఎం మార్పుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం కావడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) తనయుడు, ఎమ్మెల్సీ యతీంద్ర మరోసారి స్పందించారు. తాను ఏమి చెప్పదలచుకున్నాననే దానిపై ఇప్పటికే వివరణ ఇచ్చానని, మళ్లీ మాట్లాడి వివాదం సృష్టించదలచుకోలేదని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తన తండ్రి సిద్ధరామయ్యే ఐదేళ్లూ పూర్తికాలం ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పారు.
శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ… తాను మాట్లాడిన మాటలు వివాదాస్పదమైనట్టు తెలియగానే వివరణ ఇచ్చానని చెప్పారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై పార్టీలోనే మాట్లాడతానని… మీడియా ముందు మాట్లాడనని అన్నారు. పార్టీ నాయకత్వం నోటీసు జారీ చేసే అవకాశాలపై అడిగినప్పుడు, బెళగావిలో తాను మాట్లాడిన దాంట్లో ఎలాంటి పొరపాటు లేదని, పార్టీ నోటీసు ఇస్తుందేమో చూడాలని అన్నారు. ‘నవంబర్ రివల్యూషన్’ అనేది పూర్తిగా ఊహాగానాలేనని కొట్టివేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సిద్ధరామయ్యే ఐదేళ్లు పూర్తికాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చెప్పారు.
Yathindra Siddaramaiah: ఇంతకీ యతీంత్ర ఏమన్నారంటే ?
బెళగావిలో గత బుధవారంనాడు జరిగిన ఒక కార్యక్రమంలో తన తండ్రి సిద్ధరామయ్య రాజకీయ కెరీర్ చివరిదశలో ఉందని యతీంద్ర చెప్పారు. ఈ పరిస్థితిలో బలమైన, ప్రగతిశీల భావజాలం ఉన్న నాయకుడు కావాలని, ఆయనకు సిద్ధరామయ్య మార్గదర్శిగా ఉంటారని చెప్పారు. సతీష్ జార్కిహోళికి ఆ లక్షణాలు ఉన్నాయని అన్నారు. కొద్దికాలంగా ఉప మఖ్యమంత్రి డీకే శివకుమార్కు సీఎం పగ్గాలు అప్పగించాలని పలువురు సొంత పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న క్రమంలో సతీష్ జార్కిహోళి పేరును యంత్రీంద్ర తెరపైకి తీసుకు రావడం చర్చనీయాంశమైంది. దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం స్పందించారు. ఏమి మాట్లాడదలచుకున్నావనే విషయాన్ని తాను యతీంద్రను అడిగానని, తన సిద్ధాంతాల గురించే చెప్పదలచుకున్నట్టు యతీంద్ర చెప్పాడని, ఫలానా వ్యక్తి సీఎం కావాలని యత్రీంద్ర అనలేదని, ఆయన వ్యాఖ్యలని వక్రీకరించారని తెలిపారు.

Siddaramaiah: కుమారుడి వ్యాఖ్యలపై సీఎం సిద్ధూ ఏమన్నారంటే ?
కర్ణాటకలో సీఎం మార్పు అంశంపై రాజకీయ వేడి కొనసాగుతోన్న వేళ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన మాటలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో కలవరం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిద్ధూ స్పందించారు. ‘‘యతీంద్ర ప్రకటనను వక్రీకరించారు. ఇక దానిపై నేను చెప్పడానికి ఏముంటుంది..? నేను నా కుమారుడితో మాట్లాడాను. అసలు ఏం చెప్పాలనుకున్నావని అడిగాను. తన సిద్ధాంతాల గురించి మాత్రమే చెప్పాలని అనుకున్నట్లు యతీంద్ర చెప్పాడు. ఫలానా వ్యక్తి సీఎం కావాలని అతడు అనలేదు’’ అని సిద్ధరామయ్య సమాధానం ఇచ్చారు.
కబ్బన్ పార్క్లో పాదయాత్ర చేసిన ఉప ముఖ్యమంత్రి
బెంగళూరు(చిత్రదుర్గం): రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆదివారం బెంగళూరు కబ్బన్ పార్క్లో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బెంగళూరును మరింత పచ్చగా, సుందరంగా , పరిశుభ్రంగా ఉంచడానికి ప్రజల సహకారము ఎంతో అవసరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీ ఖాతా ఆస్తులను, ఏ ఖాతా ఆస్తులుగా మార్చుకోవడానికి అవకాశం కల్పించడం పట్ల కొందరు సంతోషం వ్యక్తం చేశారు. పలువురు పిల్లలు, పెద్దలు , మహిళలు శివకుమార్తో స్వీయ చిత్రాలను దిగారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి లాంటి వారు ప్రభుత్వ విధానాలను అనవసరంగా విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
Also Read: అవినీతిలో అగ్రస్థానంలో మహారాష్ట్ర ?
