కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం – బొత్స సత్యనారాయణ
Botsa Satyanarayana
Botsa Satyanarayana in Palasa: కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన 18 నెలల్లో మూడు ప్రముఖ దేవాలయాల్లో తొక్కిసలాట జరిగి 24 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) అన్నారు. 2015లో గోదావరి పుష్కరాల సమయంలో సీఎంగా ఉన్న చంద్రబాబు… తన పబ్లిసిటీ పిచ్చి కోసం 29 మంది ప్రాణాలను గాలిలో కలిపేసారన్నారు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోనికి వచ్చిన కూటమి ప్రభుత్వం… ప్రజల ప్రాణాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కుంటి సాకులతో బాధ్యతలను నుండి తప్పించుకోవాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో గాయపడి పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. బాధితులను పరామర్శించి, వారికి అందుతున్న చికిత్స, యోగక్షేమాలు తెలుసుకున్నారు. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణతో పాటు ఉత్తరాంధ్రా రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, వైయస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఎమ్మెల్సీ రవిబాబు, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, వైయస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ… కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాటలో 9 మంది భక్తులు చనిపోవడం దురదృష్టకరం. మృతి చెంది వారికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఘటనలో గాయపడిన వారు కూడా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. ఏదైనా దుర్ఘటన జరిగిన తర్వాత… దానికి సానుభూతి తెలిపడం, లేదంటే ఖండించడం ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలో ఇది మూడో దుర్ఘటన. తిరుపతి, సింహాచలం, ఇప్పుడు కాశీబుగ్గతో కలిసి మూడు ఘటనలు చోటుచేసుకున్నాయి. కాబట్టి కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
Botsa Satyanarayana in Palasa: కాశీబుగ్గ దేవాలయం 4 వ నెలలో ప్రారంభమైంది. అప్పటి నుంచి భక్తులు దర్శనానికి వస్తున్నారు. శనివారం 1500-2000 మంది భక్తులు దర్శనానికి వస్తున్నారు. నిన్న తొలి ఏకాదశి కాబట్టి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దాన్ని స్దానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం అంచనా వేయాల్సిన అవసరం ఉంది. కానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దీనిపై మాట్లాడుతూ ఆలయ నిర్వాహకులు మాకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. ఆలయ నిర్వాహకుడు మాత్రం ముందురోజే పోలీసులకు సమాచారం ఇచ్చామని చెబుతున్నారు. అయినా ప్రభుత్వ యంత్రాంగం సక్రమంగా స్పందించలేదు. ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. తొక్కిసలాటపై పూర్తిస్దాయిలో విచారణ జరగాలి.

తిరుమలలో తొక్కిసలాటలో 8 మంది, సింహాచలంలో జరిగిన ఘటనలో 7 చనిపోతే.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఎలాంటి నివారణ చర్యలు తీసుకుంది ? అదే విషయాన్ని మేం ప్రశ్నిస్తే.. రాజకీయం చేస్తున్నామంటూ మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం నడుస్తుందా? భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. జరిగిన ఘటనకు ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు ఎవరు బాధ్యత వహిస్తారని బొత్స సత్యనారాయణ నిలదీశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా . దీనిపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని… అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయియని ఆయన స్పష్టం చేశారు.
మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలి – మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు
Botsa Satyanarayana in Palasa: కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కాశీబుగ్గ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మహిళలే అధికంగా చనిపోవడం బాధాకరం. మా పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఆదేశాల మేరకు బాధితులకు ప్రాథమిక వైద్య సహాయం అందించాం. ఇవాళ కూడా మా పార్టీ నేతలంతా కలిసి పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించామని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju) అన్నారు .
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తోంది – మాజీ మంత్రి కురసాల కన్నబాబు
Botsa Satyanarayana in Palasa: కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు చనిపోవడంతో పాటు పలువురు గాయపడిన ఘటన చాలా బాధాకరం. వైయస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం శ్రీ వైయస్.జగన్ ఆదేశాల మేరకు ఇవాళ పార్టీ తరపున క్షతగాత్రులను పలాస ఆసుపత్రిలో పరామర్శించాం. పుణ్యదినాన దేవుడి దర్శనం చేసుకోవాలన్న ఆశతో వచ్చిన నిరుపేదలు… ఈ ఘటనలో చిక్కుకోవడం హృదయవిదారకం. ఇంత దారుణం జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం మనం నిమిత్తమాత్రులం అని వైరాగ్యం ప్రదర్శిస్తున్నారు. 2024లో కూటమి పాలన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు పాలనలో నిమిత్తమాత్రుడిగానే కనిపిస్తున్నాడు. 9 మంది చనిపోయి, పెద్ద ఎత్తున భక్తులు గాయపడితే.. చంద్రబాబు నేను నిమిత్తమాత్రుడనని చెబుతుంటే.. భక్తులను ఎవరి రక్షించాలి. అంటే దేవుడే తన భక్తులను రక్షించుకోవాలి. ఈ ప్రభుత్వ హయాంలో ఇదే మొదటి సంఘటన కాదు. తిరుమలలో జనవరిలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది భక్తులు చనిపోతే… సింహాచలంలో గోడ కూలి 7 గురు, కాశీబుగ్గలో 9 మంది చనిపోయారు. కాశీబుగ్గ ప్రమాదం గురించి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుసహా మంత్రులందరూ ఇది ప్రైవేటు ఆలయం అని చెబుతున్నారు.

ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నట్లు, ఆలయాలను ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం ఉందా? బట్టలషాపు ప్రారంభోత్సవానికి సినిమా హీరోయిన్లు వచ్చినప్పుడు, సినిమా ప్రమోషన్ కు వచ్చినప్పుడు, ఐపీఎస్ అధికారి మీద కేసు పెట్టడానికి వచ్చినప్పుడో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తారు. రోప్ పార్టీలు పెడతారు. వేలాదిమందిభక్తులు దేవుడి దర్శనానికి వస్తేఅక్కడ బందోబస్సు పెట్టరా ? అది ప్రైవేటు ఆలయమని చెప్పి గాలికొదిలేస్తారా? ప్రైవేటు ఆలయానికి, ప్రభుత్వ ఆలయానికి తేడా సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఒక కుటుంబం, ఫ్యామిలీ ట్రస్టు కేవలం తాము పూజించుకోవడానికి మాత్రమే ఏర్పాటు చేసుకుని, ఇతరులెవ్వరినీ అనుమతించకుండా నిర్వహించుకునే ఆలయాన్ని ప్రైవేటు ఆలయం అంటారు.
ఎవరైనా ప్రవైటు వ్యక్తులు ఆలయాన్ని నిర్మించి అక్కడకు భక్తులను అనుమతిస్తే అది పబ్లిక్ ఆలయంగానే చూడాలని సుప్రీం కోర్టు చెప్పింది.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో తొక్కిసలాట, చంద్రబాబు 2015లో సీఎంగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాల సందర్బంగా ఆయన ప్రచార పిచ్చి వల్ల జరిగిన తొక్కిసలాటలో 29 మంది చనిపోయారు. క్రౌడ్ మేనేజిమెంట్, జనాల రద్దీ నేపధ్యంలో భద్రతా చర్యలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రణాళిక ఉందా? రెడ్ బుక్ తప్ప రూల్ బుక్ ఏదన్నా ఉందా? కేవలం రెడ్ బుక్ మాత్రమే అమలు చేస్తారా? ఈ ఘటన కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యమే. తప్పించుకునే ప్రయత్నం చేయడం సరికాదు. అది చేతకాని తనం. ఇది తొలిసారి జరిగిన ఘటన కూడా కాదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మూడో దుర్ఘటన ఇది.
ఇది కూడా చదవండి: నా కుటుంబమే లక్ష్యంగా క్రిమినల్ కేసులు – మాజీ సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ
అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ క్యాండిల్ ర్యాలీ

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామ ఆలయంలో శనివారం ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన భక్తుల ఆత్మకు శాంతి చేకూరాలని వైఎస్సార్సీపీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. ఈ మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొని మృతి చెందిన భక్తులకు సంతాపం ప్రకటిస్తూ క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. అనకాపల్లిలో వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని పుట్టపర్తిలో వైఎస్సార్సీపీ నేతల కొవ్వొత్తుల ర్యాలీ. కాశిబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి రోజు మృతి చెందిన భక్తులకు సంతాపం ప్రకటిస్తూ వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ వద్ద నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ , మాజీ ఎమ్మెల్యే వెంకట్రావు, రౌతు సూర్యప్రకాశరావు, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.
Also Read: నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్ట్
