పండగ ముందే ధాన్యం డబ్బులు రైతులకు అందాలి-మంత్రి నాదెండ్ల
Minister Nadendla
పండగ ముందే ధాన్యం కొనుగోళ్ళు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసి, వారు నిజమైన పండగ జరుపుకునేలా చూడాలని పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు ఆదేశించారు. జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ నందు మంత్రి ఎం.డి.ఎస్.డిల్లీ రావుతో కలసి అధికారులతో ముఖా ముఖి చర్చించారు. ధాన్యం సేకరణ లో సమస్యలపై, గోడౌన్ స్పేస్ , మిల్లర్ల నుండి బి.జి ల సమస్య, స్టోరేజ్ సమస్య తదితర అంశాల పై ఆరా తీసారు. పౌర సరఫరాల ఎం.డి డిల్లీ రావు మాట్లాడుతూ ఎఫ్.సి.ఐ జనరల్ మేనేజర్ తో మాట్లాడి స్టోరేజ్ సమస్య లేకుండా చూస్తానని తెలిపారు. మంత్రి మాట్లాడుతూ రైతులతో ఆర్.డి.ఓ లు స్వయంగా మాట్లాడి ఏదైనా సమస్య ఉంటె వెంటనే స్పందించాలని తెలిపారు. పండగ ముందే షెడ్యూల్ వేసుకొని వచ్చే 4,5 రోజుల్లోనే ధాన్యం కొనుగోళ్ళు చేయాలనీ, అలాగే చెల్లింపులు వెంట వెంటనే జరగాలని సూచించారు. రైతుల్లో నమ్మకం కలిగేలా రెవిన్యూ అధికారుల చర్యలు ఉండాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఏదైనా సమస్య ఉంటె జే సి గారి దృష్టిలో పెట్టాలని అన్నారు. మిల్లర్లు మనం చెప్పినట్లు నడచుకోవాలని, అందులో ఎటువంటి రాజీ ఉండవద్దని స్పష్టం చేసారు.అనంతరం మంత్రి పెద తాడివాడ లో రైతు సేవ కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసారు. తేమ యంత్రాన్ని, రికార్డు లను పరిశీలించి, సిబ్బంది తో మాట్లాడారు. మిల్లర్ల తో మాట్లాడి ప్రభుత్వానికి సహకరించాలని, రైతులకు ఇబ్బంది పెట్టవద్దని కోరారు. రైతులతో మాట్లాడి అధిక దిగుబడి వచ్చే వంగడాల పై అవగాహన పెంచుకోవాలని , రైతులకు అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మిల్లర్ల సమస్యలను, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం సచివాలయం వద్ద ప్రజల నుద్దేశించి మాట్లాడారు. ఈ ఏడాది గతం లో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రం లో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలనీ లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందన్నారు. 97.6 శాతం మంది రైతులకు 24 గంటల్లోనే సుమారు 680 కోట్ల రూపాయల నగదు జమ చేయడం జరిగిందని తెలిపారు. గ్రామాల్లో మన సంస్కృతిని కాపాడేది రైతులేనని, వారి కళ్ళల్లో ఆనందం చూడాలనే రైతుకు అన్ని విధాల భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. రైతులు నూతన వ్యవసాయ పద్ధతులను నేర్చుకొని అచరించాలని, ఉద్యాన పంటలతో ఎక్కువ లబ్ది జరుగుతుందని తెలిపారు. ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేసామని, 3 విడతలలో సుమారు కోటి మంది సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. పట్టణాల్లో గోధుమ పిండి కిలో 20 రూపాయలకే అందజేస్తున్నామని త్వరలో గ్రామాల్లో కూడా అందజేస్తామని అన్నారు.ఈ కార్యక్రమం లో నేల్లిమర్ల ఎం.ఎల్.ఏ లోకం నాగ మాధవి, జే.సి సేదు మాధవన్, పౌర సరఫరాల జిల్లా మేనేజెర్ బి.శాంతి, ఆర్.డి.ఓ కీర్తి, జిల్లా వ్యవసాయ అధికారి తారక రామా రావు తదితరులు పాల్గొన్నారు.
